శ్రీరామ నవమి





 త్రేతాయుగంలోని వసంత రుతువు చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడని అనేక పురాణాలు పేర్కొంటున్నాయి. రాముడు అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల సమయంలో జన్మించాడు. పద్నాలుగేళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్య చేరుకున్న రాముడికి పట్టాభిషేకం కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది.

          రామాయంలో కోసల దేశానికి రాజైన దశరథుడికి కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే ముగ్గురు భార్యలు. వారికి సంతాన భాగ్యం లేకపోవడంత వశిష్ట మహర్షి సలహాతో పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించిన దశరథుడికి అగ్నిదేవుడు ప్రసన్నమై పాయస పాత్రను అందజేస్తాడు. దశరథుడు తన ముగ్గురి భార్యలకు ఈ పాయసాన్నిచ్చిన కొద్దికాలానికే వారు గర్భం దాల్చారు.

            చైత్ర మాసం తొమ్మిదో రోజైన నవమి నాడు మధ్యాహ్నం కౌసల్యకు రాముడు జన్మించాడు. ఆ తర్వాత భరతుడు కైకేయికి, లక్ష్మణ శతృఘ్నలు సుమిత్రకు జన్మించారు. ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహా విష్ణువు ఏడో అవతారం రాముడు. లంకాధిపతి రావణ సంహారం కోసం రాముడు అవతరించాడు. ఇటీవల జరిపిన శాస్త్ర పరిశోధనల ప్రకారం శ్రీరాముడు క్రీ.పూ 5114 జనవరి 10 న జన్మించి ఉంటారని భావిస్తున్నారు.
           

          రామరాజ్యంలో ప్రజలంతా సిరిసంపదలతో, సుఖ సంతోషాలతో ఉన్నారనేది హిందువుల నమ్మకం. సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది. శ్రీరాముడు జన్మించింది మధ్యాహ్నం కాబట్టి ఆ సమయంలోనే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది శోభా యాత్ర. శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్థ గోళానికి చేరువగా వస్తాడు.
            రాముడిని సూర్యవంశానికి ఆరాధ్యుడిగా పేర్కొంటారు. ఈ వంశానికి చెందిన ప్రముఖలు దిలీపుడు, రఘు. వీరిలో రఘు ఇచ్చిన మాటకు కట్టుబడ్డ వ్యక్తిగా ప్రసిద్ధి గాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడచి తండ్రి మాట కోసం పద్నాలుగేళ్లు వనవాసం చేశాడు. మాట కోసం నిలబడ్డాడు కాబట్టే రాముని రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలుస్తారు.
                 
             శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకం మూడుసార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ, శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీమహా విష్ణువే కౌసల్యాపుత్రుడిగా ఈ భూమిపై జన్మించిన పర్వదినాన్ని శ్రీరామనవమిగా జరుపుకుంటాం.

      ఎవరైతే కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రంలోనే మరణిస్తారో వారు మరణించే కాలంలో సాక్షాత్తు పరమేశ్వరుడు ఈ తారక మంత్రాన్ని వారి కుడి చెవిలో చెప్పి సధ్గతి కలిగిస్తాడనేది ఐతిహసాలు ఘోషిస్తున్నాయి. ఇక భక్త రామదాసుగా పేరుగాంచిన కంచర్ల గోపన్న శ్రీరామనామ గాన మధుపానాన్ని భక్తితో సేవించాడు. శ్రీరామ నీ నామ మేమి రుచిరా… ఎంతోరుచిరా… మరి ఎంతో రుచిరా… అని కీర్తించాడు.
             

       రామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు ‘రా’ అనగానే మన నోరు తెరచుకుని లోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ నామం యొక్క అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట. అలాగే ‘మ’అనే అక్షరం ఉచ్ఛరిస్తే మన పెదవులు మూసుకుంటాయి కాబట్టి బయట మనకు కనిపించే ఆ పాపాలు లోనికి ప్రవేశించలేవట. అందువల్లే మానవులకు ‘రామనామ స్మరణ’ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట.

Post a Comment

0 Comments